యూనిట్

పేగు బంధాన్ని కలిపిన 'స్పందన'

పసిప్రాయంలో తల్లిదండ్రుల చెంత గారాభంగా పెరగాల్సిన వయసులో తెలిసీ తెలియక చేసిన చిన్నచిన్న తప్పులకు ఎంతో మంది చిన్నారులు తల్లిదండ్రులను వదిలి పారిపోవడం, ఇంకా అనేక అఘాయిత్యాలకు గురికావడం జరుగుతోంది. ఊహతెలిసిన తదనాంతరం తల్లిదండ్రుల పేగు బంధాన్ని తలుచుకొని కుమిలిపోయే వారు ఎంతోమంది మనకు తరచూ కనబడుతూనే ఉంటారు. ఇలాంటి ఘటన విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావుగారికి ఎదురైంది. ఆమెపేరు ఆదిలక్ష్మి, ఇంకా పూర్తిగా పరిపక్వత చెందని వయస్సు, ఇద్దరు మగ పిల్లల నడుమ జన్మించడంతో అల్లారు ముద్దుగా, మరింత గారాభంగా పెరిగింది. సున్నితమైన మనసు గల ఆదిలక్ష్మి ఒక రోజు బడికి వెళ్ళనందుకు తల్లి చెంచమ్మ మందలించింది. ఎంతో బాధపడి ఇంటినుండి పారిపోయింది. విజయవాడ బస్టాండులో బిక్కుబిక్కుమని దిక్కులు చూస్తున్న చిన్నారిని ఒకామె దయతలచి అక్కును చేర్చుకుంది.



అక్కున చేర్చుకున్న ఆ మహిళ చెన్నై నగరానికి తీసుకెళ్ళింది. అక్కడ ఆమె సన్నిహితురాలు పిల్లలు లేని మధురిక, చిన్నారి ఆదిలక్ష్మిని చూసి ఎంతో సరదాపడి పెంచుకుంటానని సదరు మహిళ నుంచి కొనుక్కుంది. తను సొంత కూతురిలా ఆదిలక్ష్మిని పెంచి పెద్దచేసింది. ఆదిలక్ష్మిని పెంచి పెద్దచేసి వివాహము చేసింది. కొద్దికాలం తరువాత పెంచిన తల్లి మధురిక వయసు మీదపడి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఆదిలక్ష్మికి కన్నవారిపై మమకారం పెంచుకుంది. వెంటనే భర్తకు విషయం చెప్పింది. ఎలాగైనా తన పుట్టింటికి తీసుకెళ్ళాలని, తల్లిదండ్రులను చూడాలని తన పేగు బంధాన్ని భర్తకు చెప్పింది. వెంటనే ఇరువురు విజయవాడకు బయలుదేరి వచ్చారు. ఆమె నివాసముంటున్న ఏరియాను గుర్తుపట్టి చూడగా రోజు రోజుకు పెరిగి మహానగరంగా మారిన నగరం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. వెంటనే ఇరువురు ఓ లాయర్‌ను సంప్రదించారు. లాయర్‌ సలహా మేరకు 'స్పందన' కార్యక్రమానికి వచ్చారు. అక్కడే ఫిర్యాదులు స్వీకరిస్తున్న జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డి.నాగేంద్రకుమార్‌కు తన స్వీయ చరిత్రను తెలిపింది. 2007 సంవత్సరంలో తను ఇంటినుండి వెళ్ళిపోయానని చెప్పింది.తనకు తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, చెంచమ్మ, అన్నా, తమ్ముళ్ళు ఉన్నారని కుటుంబ వివరాలు 'స్పందన' ఫిర్యాదులో  పేర్కొంది. వెంటనే విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీ సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావుకు తెలిపారు. కమిషనర్‌గారు మీడియా సమావేశం నిర్వహించి యువతి ఆదిలక్ష్మి గురించి వివరాలను విస్తృతంగా ప్రచారం చేయించారు. ప్రసార మాధ్యమాల్లో తన కూతురు వివరాలను తెలుసుకున్న తండ్రి లక్ష్మినారాయణ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సమయంలో ఆనందానిని  అవధుల్లేవు. వెంటనే డిసెంబర్‌ 10న విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని తన వద్ద వున్న ఆధారాలను తెలియపర్చాడు. ఆదిలక్ష్మి తన కూతురేనని నిర్ధారణకు వచ్చిన నగర పోలీస్‌ కమిషనర్‌ మీడియా సమావేశం నిర్వహించి ఆదిలక్ష్మిని తల్లిదండ్రులకు అప్పగించాడు. 

ఆదిలక్ష్మి తండ్రి మంగళగిరి లక్ష్మినారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తుండేవాడు. ఒక్కగానొక్క కూతురు, అందులో గారాబంగా పెంచుకుంటున్న కూతురు కనబడకపోవడంతో జీవితం అల్లకల్లోలంగా అనిపించింది. కూతురు సమాచారం తనకు తెలిసిన ప్రాంతాలన్ని తిరిగి ... వేసారి బిక్కమొఖం వేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఉద్యోగం కూడా సరిగా చేయలేని పరిస్థితి, ఏదో తెలియని కోపం, ఎవరిమీద చూపించాలో తెలియని వ్యధ, చివరకు ఉద్యోగం వీడి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి పట్టణాల్లో గాలించాడు. రెండు సంవత్సరాలైనా తన కుమార్తె కనపడకపోయేసరికి ఆశలు వదులుకుని హోంగార్డు ఉద్యోగాన్ని వదిలేసి చిన్నపాటి ఉద్యోగంలో కాలా వెళ్ళదీస్తున్నాడు. చివరకు పేగు బంధం ఎంతైనా గొప్పదని, ఎవరూ విడదీయలేరని రుజువైంది. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వందలాది కిలోమీటర్లు... సంవత్సరాలు గడిచినా మరచిపోని బంధం... చివరకు కాలమే వారిని కలిపేలా చేసింది. కూతురుని చూసిన తల్లిదండ్రుల గుండెల్లో అర్ధ్రత నిండింది. పేగు బంధం ఎంత బలమో ఈ ఘటన నిరూపించింది. ఆదిలక్ష్మి తిరిగి తన తండ్రిని కలుసుకునేందుకు ఎంతో ప్రయాసలు పడింది. భార్య వెనుక ఉండి ప్రోత్సహించిన భర్త కాంచీవనంను, న్యాయవాది బాలకృష్ణ ఇరువురిని నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీ సి.హెచ్‌. ద్వారకా తిరుమలరావు అభినందించారు

వార్తావాహిని