యూనిట్

రాష్ట్రవ్యాప్తంగా ''మహిళామిత్ర'', ''సైబర్‌మిత్ర''

గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌షాగారి ఆధ్వర్యాన ఢిల్లీలో జరిగిన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం గారితో పాటు హాజరయ్యాను. దేశంలో 11 రాష్ట్రాలలోని అటవీ ప్రాంత పరిధిలోనే ఉన్న మావోయిస్టు ప్రభావాన్ని సమీప భవిష్యత్తులో పూర్తిగా నిర్ములించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోం శాఖ అభిప్రాయపడింది. గిరిజన ప్రాంతాలలో త్వరితగతిన చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మావోయిస్టు ఉనికిని సమూలంగా తుడిచిపెడతాయని ఇరువర్గాలు దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశాయి. ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరి మిగత రాష్ట్రాలకు కూడా ఆచరణీయంగా నిలుస్తుందని కేంద్ర హోం శాఖ ప్రశంసించింది. గిరిజనులకు విద్య, వైద్యం, త్రాగునీరు, రహదారుల విస్తరణ, అటవీభూములపై హక్కులు కల్పించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధించవచ్చని ముఖ్యమంత్రిగారు సూచించారు. ప్రతి ఐటిడిఏ పరిధిలో సూపర్‌ స్పెషలిటీ హాస్పిటల్‌, ఐటిఐలు నెలకొల్పడం వంటివి గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయన్నారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ త్వరితగతిన ఏర్పాటు చేసి అభివృద్ధికి బాటలు పరచాలన్నారు. అటవీ ప్రాంతాలలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు పర్యావరణ, అటవీ శాఖల అనుమతులను సరళీకృతం చేయాలనీ, కాంట్రాక్టర్స్‌ ముందుకు రానిచోట కేంద్ర ప్రభుత్వ సంస్థలే నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్రాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 

హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరితగారు మహిళాశిశు సంక్షేమ శాఖా మంత్రి శ్రీమతి తానేటి వనితగారితోపాటు విశాఖపట్నంలో 'మహిళా మిత్ర', 'సైబర్‌ మిత్ర' రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించడమైనది. మహిళలు, బాలికలు సమాజంలో తమకెదురవుతున్న సమస్యలు, అన్యాయాలనుండి ఒక్క ఫోన్‌కాల్‌తో సత్వర రక్షణ పొందే అవకాశం దీనితో లభిస్తుంది. మారుతున్న కాలానికి సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎదురవుతున్న సైబర్‌ వేధింపులు, ఇతర సమస్యల నుండి పోలీస్‌ స్టేషన్లకు వెళ్లకుండానే మహిళలకు మహిళల ద్వారానే పటిష్ట రక్షణ అందించే వినూత్న వ్యవస్థ ఇది. ఫిిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు తగిన న్యాయం, భరోసా సత్వరమే అందించడం వీటి ప్రధాన ధ్యేయం. 

ఆంధ్ర యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య శ్రీ పివిజిడి ప్రసాద్‌ రెడ్డిగారి ఆధ్వర్యంలో జరిగిన పాలక మండలి సమావేశంలో పాలుపంచుకున్నాను. ఈ సందర్భంలో వారు పోలీస్‌ సేవలు మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరడానికి వర్చ్యువల్‌ పోలీస్‌ స్టేషన్స్‌ ఏర్పాటును ప్రతిపాదించారు. అతి తక్కువ ఖర్చుతో ఈ వర్చ్యువల్‌ పోలీస్‌ స్టేషన్స్‌ ద్వారా మెరుగైన సేవలు ప్రజలకు అందే అవకాశం మెండుగా ఉన్నది. పోలీస్‌ ప్రజా సంబంధాల మెరుగుదలకు ఆంధ్రయూనివర్సిటీ మరియు ఇతర విద్యాసంస్థలతో కలిసి మరిన్ని అధ్యయనాలు, ఆలోచనలు పంచుకునే దిశగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉన్నది. 

విజయవాడ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లో జరిగిన ''బహిరంగ ప్రదేశాల్లో సమాజ సహకారంతో మహిళల రక్షణ'' ముగింపు కార్యక్రమానికి హాజరయ్యాను. నాడు విజయవాడ పోలీస్‌ కమీషనర్‌గా ప్రయోగాత్మకంగా ఆరంభించిన 'మహిళా మిత్ర' సామాజిక సేవ కార్యక్రమం ఇంతగా పురోగతి సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. నేడు రాష్త్ర వ్యాప్తంగా ప్రారంభించిన 'మహిళా మిత్ర', 'సైబర్‌ మిత్ర' కార్యక్రమాలకు స్ఫూర్తి విజయవాడ మహిళా మిత్ర సాధించిన అద్వితీయ విజయమే. 

73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి చేతుల మీదుగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పతకాలు అందుకున్న గ్రహీతలకు నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను.  

వార్తావాహిని