యూనిట్
Flash News
శభాష్ పోలీస్

కడప జిల్లా ఇందిరానగర్కు చెందిన ఆదిజాల మణికంట అనే విద్యార్థి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. స్నేహి తులతో కలిసి సరదాగా షికారుకు పాలకొండకు వెళ్ళారు. అక్కడి వాటర్ఫాల్స్లో ఈత కొట్టేందుకు సిద్దమయ్యారు. అక్కడే ఒక తేనెతుట్టె కనిపించడంతో వారిలో ఒకరు తేనెతుట్టెపై రాయి విసిరాడు. ఒక్కసారిగా పెద్ద తేనెటీగలు విద్యార్థులను చుట్టుముట్టాయి. ముగ్గురు విద్యార్థులు వెంటనే పరుగు లంఘించారు. వారిలో మణికంఠను తేనెటీగలు కుట్టాయి, బాధను తట్టుకోలేక ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు. గాయపడిన మణికంఠ మూడు గంటల పాటు లోయలోపడి అరుస్తూ ఏడుస్తుండటంతో అక్కడే ఉన్న కొంతమంది విషయం తెలుసుకుని సమీపంలోని రిమ్స్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన ఎస్.ఐ. విద్యాసాగర్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికీ విద్యార్థి మణికంఠను తేనెటీగలు చుట్టుముడుతూనే ఉన్నాయి. వెంటనే ఎస్.ఐ. విద్యాసాగర్ బృందం దుప్పట్ల సాయంతో అతికష్టం మీద విద్యార్థిని లోయలో నుంచి బయటకు తీశారు. అప్పటికే కాలు విరిగి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని ఎస్.ఐ. విద్యాసాగర్ భుజంపై మోసుకుని ఒకటిన్నర కిలోమీటర్ మోసుకువచ్చాడు. వెంటనే 108కు సమాచారమిచ్చి, మెరుగైనచికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సమీప ప్రజలు ఎస్.ఐ. విద్యాసాగర్ను, ఆయన పోలీసు సిబ్బందిని పలువురు ప్రశంసించారు. ఎంతో సాహసంతో విద్యార్థిని రక్షించిన ఎస్.ఐ.ని రిమ్స్ సిఐ సత్యబాబు అభినందించారు. జిల్లా ఎస్.పి. అభినందనలు విషయం తెలుసుకున్న కడప జిల్లా ఎస్.పి. అభిషేక్ మహంతి ఎస్ఐ మరియు అతని బృందాన్ని అభిందించారు. ఎస్.ఐ. విద్యాసాగర్, కానిస్టేబుళ్ళు పుష్పరాజు, హరిప్రసాద్, హోంగార్డు బాబులకు నగదు రివార్డుతోపాటు, ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్.పి. మాట్లాడుతూ ప్రజల ప్రాణ, మానాలు కాపాడిన వారే నిజమైన పోలీసన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సిబ్బంది బాధ్యతతో పనిచేసినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం కడప డీఎస్పీ సూర్యనారాయణ అభినందనలు తెలిపారు.