యూనిట్

మేకల కాపరి హత్యకేసు నిందితుల అరెస్టు

పొలంలో ఒంటరిగా మేకలతో ఉన్న కాపరిని గుర్తించిన దుండగులు కిరాతకంగా హత్యచేసి కొన్ని మేకలను తరలించుకు పోయారు. తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన మేకల కాపరి రామునాయక్‌ పొలంలో హత్యచేయబడ్డాడు. బాధితురాలు దేవమ్మ జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. హత్యజరిగిన ప్రదేశానికి దగ్గరలో నేషనల్‌ హైవే ఉంది. వెంటనే దర్యాప్తు బృందం అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా కృష్ణగిరి మండలం అమకతాడు టోల్‌గేటు వద్ద సీసీ ఫుటేజీలో టాటాఏస్‌లో మేకలు తరలిస్తున్న వాహనం బయటపడింది. దీంతో వెంటనే కూపీ లాగగా నిందితులు ప్యాపిలికి చెందిన కృష్ణకాంత్‌, పొదొడ్డికి చెందిన చెన్నుగా తేలింది. వెంటనే వారిని అదుపులోనికి తీసుకుని జిల్లా ఎస్‌.పి.ముందు హాజరుపరిచారు. వారి వద్దనుంచి రూ.55వేల నగదు, టాటాఏస్‌ వాహనం స్వాధీనం చేసుకున్నారు. తమకున్న అప్పును తీర్చేందుకు ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు విచారణలో తెలిపారు. హైదరాబాద్‌లోని జియాగూడలో మేకలను రూ.70వేలకు విక్రయించినట్లు నిందితులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన ఎస్‌.పి. ఫక్కీరప్ప డోన్‌ డిఎస్‌పి ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో ఒక స్పెషల్‌ టీమ్‌ను ఏర్పాటు చేశారు. కేసును చాకచక్యంగా చేధించినందుకు రాష్ట్ర డిజిపి శ్రీ డి.గౌతమ్‌ సవాంగ్‌గారితోపాటు ఇతర అధికారులు, జిల్లా ఎస్‌.పి. స్పెషల్‌ టీమ్‌ను అభినందించారు. కేసు దర్యాప్తు బృందం డీఎస్‌పి ఖాదర్‌బాషా, సిఐలు సోమశేఖర్‌రెడ్డి, రామలింగయ్య, సురేష్‌బాబు, విక్రమసింహ, చంద్రబాబునాయుడు, ఎస్‌.ఐ.లు సతీష్‌కుమార్‌, రమేష్‌బాబు, చంద్రశేఖరరెడ్డి, మారుతీశంకర్‌, వేణుగోపాల్‌ తదితర టీమ్‌కు ఎస్‌.పి. ఫక్కీరప్ప నగదు రివార్డులు ఇచ్చి అభినందించారు.

వార్తావాహిని