యూనిట్

హింసావాదానికి విరుగుడు

మారుమూల మన్యం ప్రాంతాలలో నివశించే గిరిజన ప్రజలకు సమగ్ర అభివృద్ది కార్యక్రమాలు చేరువ చేయడం ద్వారా నక్సలిజం వంటి హింసావాద ప్రభావాలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమేనని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు అన్నారు. మావోయిస్ట్‌ ప్రభావిత 11 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పనులకు సంబంధించి కేంద్ర  హోమ్  ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా మాట్లాడుతూ మావోయిస్ట్‌ ప్రభావిత పరిదిలో యుద్ద ప్రాతిపదికిన అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని ప్రభావిత రాష్ట్ర ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలలో మాత్రమే మావోయిస్ట్‌లు ఉనికిలో వున్నారని, భవిష్యత్‌లో అది కూడా తుడిచిపెట్టుకు పోనున్నదని అన్నారు. హోమ్ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా మాట్లాడుతూ మావోయిస్ట్‌ల కట్టడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అత్యుత్తమ విధానాలను పాటిస్తున్నాయని, ఇతర రాష్ట్రాలకు అవి ఆదర్శంగా నిలుస్తాయని ప్రశంసించారు. ప్రభావిత ప్రాంతాలలో రహదారులు, సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ టవర్‌లు నిర్మించాల్సిన అవసరం వుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగదు బదిలీ లబ్ది నేరుగా గిరిజనులకు అందేందుకు గాను విరివిగా బ్యాంకుల శాఖలను, ఏటిఎమ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు పలు సూచనలు చేశారు. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాలలో సమగ్రాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చని సూచించారు. విద్య, వైద్యం,తాగునీరు, రహదారుల విస్తరణ, గిరిజనులకు అటవీభూములపై హక్కులు కల్పించడం వంటి ప్రధాన అంశాలపై మనం దృష్టి కేంద్రీకరించవలసి వున్నదని సూచించారు. కేంద్ర ¬ం శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా గారు, సహాయ మంత్రి శ్రీ జి. కిషన్‌ రెడ్డి గారు, గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండాల గారి దృష్టికి పలు సూచనలను తీసుకొని వచ్చారు. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన మూడు నెలల కాలంలోనే గిరిజనుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని వాటిని వివరించారు. విభజన చట్టంలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసిందని, దీనిపై జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే దాన్ని సాకారం చేయాలని విన్నవించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తదుపరి ఇంతకు ముందు ఎవరూ సాహసించని విధంగా గిరిజన ప్రాంతమైన పాడేరులో వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, దీనికి సత్వరమే అనుమతులు మంజూరు చేసి సహకరించాలన్నారు. అదే విధంగా ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని కూడా నిర్మించనున్నామని తెలిపారు. గిరిజనులు మెరుగైన వైద్య సదుపాయాలకు దూరమై ఎన్నో కష్టాలు పడుతున్నారని, ప్రతి ఐటిడిఏ పరిధిలో ఒక సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేయడంద్వారా వారికి పటిష్ట ఆరోగ్య భద్రత అందించవచ్చని సూచించారు. గిరిజనులు సుదీర్ఘ కాలంగా అటవీ ప్రాంత భూ పట్టాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉంటున్న ప్రాంతాలలోనే పట్టాలు ఇవ్వాల్సిన అవసరం వుందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తరువాత నాలుగు బెటాలియన్ల కేటాయింపు జరిగిందని, సత్వరమే వాటిపై దృష్టిసారించి అవసరమైన నిధులు మంజూరు చేసి హామీ నెరవేర్చాలన్నారు. తెలంగాణ తరపున హోమ్  మంత్రి శ్రీ మహమూద్‌ ఆలీ, డిజిపి శ్రీ మహేందర్‌ రెడ్డి గార్లు పాల్గొనగా మన రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్‌ వి సుబ్రహ్మణ్యం గారు, డిజిపి శ్రీ డి. గౌతం సవాంగ్‌ గారు పాల్గొన్నారు.

వార్తావాహిని